పిల్లల ‘మంచి చెడు’
బాధ్యత తల్లిదండ్రులదే!
మానవత్వం పరిమళించే మనసులు...
మంచితనం గుబాళించే మనుషులున్న చోటే శాంతి, సౌఖ్యం వెల్లివిరుస్తాయి. సాటి మనిషి మీద నమ్మకం, గౌరవం పెంపొందుతాయి. మరిలాంటి గుణాలకు పునాది ఎక్కడ పడుతుందో తెలుసా?
మన ఇంట్లోనే.
అదీ చిన్న వయసులోనే.
బాల్యం నుంచే పిల్లలకు మంచీ మర్యాదా అలవడేలా పెంచితే ప్రపంచం శాంతిధామంగా మారుతుందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు!
‘’వాళ్ల నానమ్మకి టాబ్లెట్ ఇమ్మని చెప్పినా... ఆ మొబైల్ పట్టుకొనో, టీవీ ముందు కూర్చునో కదలనే కదలడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకంటే...‘నానమ్మనే తెచ్చుకోమను’ అని ఎదురు సమాధానం చెప్తాడు’’.
ఇప్పుడు ఇంట్లో ఒక్కొక్కరికీ ఒక్కో మొబైల్ ఫోన్ కదా!.
చదువు సంగతి పక్కనపెట్టి పిల్లలు ఆ మొబైళ్ళు తీసుకొని ఆటలే ఆటలు…
మాకు మాత్రం ఫోన్ వస్తే వంటింట్లోనుంచి ఎంత పనిలో ఉన్నా పరిగెత్తుకు రావాల్సిందే.
ఇంటి ముందు తలుపు తడుతున్నా, బెల్ మోగిస్తున్నా, కేకలు పెడుతున్నా పట్టించుకోరు. బంధుమిత్రులు ఇంటికొచ్చి పలకరించినా ‘హాయ్ ఆంటీ!’ అని ఒక నవ్వు నవ్వేసి వెళ్లిపోతారు. బాగున్నారా? అని కూడా అనరు. చివరికి అన్నం తింటూ వెక్కిళ్లు పెడుతున్నా… కాస్త మంచినీళ్లయినా ఇస్తామన్న ధ్యాసే పట్టదు పపిల్లలకి’’ అనుభవాలు ఈ తరం తల్లిదండ్రులందరికీ వుంది.
పిల్లల్లో ఒకరకమైన పట్టని తనం. ఇతరుల అవసరాలకు స్పందించని గుణం కనిపించి తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి.
అయితే, ఇందుకు బాధ్యులు తల్లిదండ్రులే. చిన్న వయసులోనే పిల్లలకు మంచి చెడ్డలను నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్న విషయాన్ని గుర్తించాలని మానసిక తత్వవేత్తలు కూడా అంటున్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ! అన్నారు పెద్దలు. వారి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించకపోవడమే ఇందుకు మూల కారణం.
తల్లిదండ్రులు, బోధకులు, ఇరుగు పొరుగువారు సమాజం, మీడియా ఇవన్నీ కూడా చిన్నప్పటినుండి జ్ఞానాన్ని పెంచడానికి ఇచ్చే ప్రాధాన్యం, విలువల్ని నేర్పించడానికి ఇవ్వడంలేదు. రెండేళ్లకే ఎబిసిడిలు గుర్తించడానికి వీలయ్యే పుస్తకాలు, మొబైళ్ళు వచ్చేయి కదా ఇప్పుడు నాలుగేళ్ళ నుంచే నర్సరీ చదువులు.. డిజిటల్ క్లాసులు, జికె సమాచారాన్నంతా పసి కందుల ముందు ఉంచుతున్నారు. తాజాగా మాతృ భాషనే విస్మరించి, ఆంగ్ల మాధ్యమ విద్యను వాళ్ల బుర్రలోకి ఎక్కించబోతున్నారు.
పిల్లల వయసును బట్టి, అభిరుచులను బట్టి తీర్చిదిద్దలన్న కనీసపు ఆలోచనలు తల్లిదండ్రులు చేయడంలేదు. బలవంతపు చదువులు చదివిస్తున్నారు. మొబైళ్ళు, టీవీల ప్రభావం పిల్లలపై బాగా పడుతుంది. బడిలోనూ, ఇంట్లోనూ పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోవటం లేదు.
పక్కవాడి పిల్లాడితో వీళ్ల ప్రవర్తన ఎలా ఉంది, తప్పుగా ఉంటే ఎలా సరిచేయాలి అన్న ఆలోచన మాత్రం చేయడంలేదు. తమ పిల్లలు దురుసుగా మాట్లాడినా, అవతలి వాడిని రంగు, ఎత్తు, సన్నం, లావు తదితర లక్షణాలను బట్టి హేళన చేసినా తల్లిదండ్రులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అందరూ ఇలా ఉంటారని కాదు. ఉంటున్న వారి సంఖ్య గతం కంటే పెరుగుతోందన్నది మాత్రం సత్యం. ఈ ధోరణి పిల్లలకు నష్టమే చేస్తుంది. వాళ్లు తరగతులలో మొదటి స్థానంలో ఉండగలరేమో కానీ మానవ సంబంధాలలో మాత్రం చివరి స్థానంలో ఉంటారు.
పక్కనున్న వారి సమస్యను అర్థం చేసుకోలేని వాళ్లు, పట్టించుకోలేని వాళ్లు ఇతరులతో కలిసి పనిచేయలేరు. అందుకే పిల్లల్లో మానవ సంబంధాలను ఏర్పరచాలి. చుట్టూ వున్నవారి పట్ల ప్రేమ, దయ పెరిగేలా చేయాలి. తోటిపిల్లల, కుటుంబ సభ్యుల సమస్యలను అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించేలా ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు ఈ దిశగా తమ ప్రయత్నాలను ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచిది. పిల్లల వయసుకు తగినట్టుగా తల్లిదండ్రులు కొన్ని మార్గదర్శక సూత్రాలను పాటించాలి.
నాలుగైదేళ్ళ పిల్లలకు…
నడక నేర్చుకునే వయసునుంచే పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలి. తల్లిదండ్రులు వారిపట్ల ఎంత ప్రేమాభిమానంతో దయా గుణంతో వ్యవహరించగలిగితే అంత ఫలితం ఉంటుంది. వారు ఇతరులపట్ల కూడా తమలాగే ఉండగలుగుతారు. మీ పిల్లలని తమ బొమ్మల్ని తోటి పిల్లలకి ఆడుకోవడానికి ఇమ్మని ప్రోత్సహించండి. చివరికి నీ బొమ్మలు నువ్వు తీసేసుకోవచ్చు. కాసేపు ఆడుకోవడానికి ఇవ్వు…అంటే ఇవ్వడానికి ఎక్కువ మంది సిద్ధంగానే ఉంటారు. లేకపోయినా నచ్చచెప్పడానికి ప్రయత్నించాలి. ఇతరులను సంతోషపెట్టడంలో వచ్చే సంతృప్తి వారికి ఆ వయసులోనే అనుభవంలోకి రావడం ఎంతో మంచిది. జీవితాంతం పంచుకునే లక్షణాన్ని మిగుల్చుకోగలుగుతారు. మనుషుల మధ్య బంధం ఏర్పడడంలో, గట్టిపడడంలో పంచుకునే లక్షణం కీలకపాత్ర పోషిస్తుంది.
ఐదేళ్లనుంచి ఎనిమిదేళ్ల వయసు పిల్లలకు..
ఈ వయసు పిల్లలపై మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆపై వయసు కలిగిన వారిపై కూడా ఈ ప్రభావం పనిచేస్తుంది. అయితే అతి చిన్న వయసు పిల్లలకు టీవీలో చూసిన పాత్రల ప్రభావం, ప్రవర్తన తప్పనిసరిగా పడుతోంది. టీవీ కార్యక్రమాల ప్రభావం పిల్లలపై పడినట్టుగా మనస్తత్వ శాస్తవ్రేత్తల పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి వారికి అన్ని ఛానళ్లు అందుబాటులో ఉంచకూడదు. ప్రేమ, దయ, స్నేహం పంచుకోవడం వంటి లక్షణాలు పెంచే కథనాలను చూపించే కార్యక్రమాలను మాత్రమే పెట్టండి. కొన్ని వీడియో గేమ్స్ హింసను ప్రోత్సహించే విధంగా ఉంటున్నాయి. వాటికి దూరంగా ఉంచండి.
పండెండేళ్ల లోపు వయసు పిల్లలకు..
ఎనిమిదేళ్లనుంచి పన్నెండేళ్ల వయసులో ఉన్న పిల్లల్ని మంచి పనులు చేసే దిశగా ప్రేరేపించాలి. తనకి నచ్చిన కళనో, ఆటనో సాధన చేయించాలి. దానిని ఇతరులకు కూడా నేర్పించమని ప్రోత్సహించాలి. అలా చేయడంవల్ల తన మీద తనకి విశ్వాసం కలగడంతోపాటు ఇతరులకు తెలియని నేర్పించడం, వారికి అండగా ఉండడం అలవాటవుతుంది. మీ పిల్లలకు కథలు చదవడం ఇష్టమనుకోండి. చదివిన కథలను ఇతరులకు సహాయం చేసే గుణాన్ని అలవర్చండి. అవసరాలలో ఉన్నవారిని ఆదుకోవడం కోసం తోచిన ఆర్థిక సహాయం చేసేలా ప్రోత్సహించండి. బహుమతులుగానో, పాకెట్ మనీగానో పిల్లలకిచ్చే డబ్బును దాచుకోమని చెప్పండి. డబ్బును అవసరాలకు వినియోగించుకునేలా నేర్పండి. దయాగుణం, దానం నిరుపేదలకు నిస్సహాయులకు ఎంతగా ఉపయోగపడుతుందో పిల్లలకు వివరిస్తే మంచి పని చేసామన్న భావనతో పిల్లలు సంతృప్తిగా ఉంటారు.
టీనేజ్ పిల్లలకు..
ఈ వయసులో పిల్లల్లో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రవర్తన, వేషధారణ తదితర విషయాల్లో తమ గ్రూపులో భాగంగానే ఉండాలన్న ఒత్తిడి తోటిపిల్లలనుంచి ఎదురవుతుంది. ఒక్కొక్కసారి దానివల్ల వారిలో దుఃఖం, అసహనం పెరగవచ్చు. నిర్లక్ష్యంగా ప్రవర్తించేలా వారిని మార్చొచ్చు. ఇలాంటప్పుడే తల్లిదండ్రులు సహనంగా వ్యవహరించాలి. వారిపట్ల మీకెంతో ప్రేముందని, ఏ సమస్యనైనా మీతో చెప్పుకోవచ్చునని తెలిసేలా ప్రవర్తించాలి. వారి సమస్యలను అంతేనా అన్నట్టు తీసి పడేయవద్దు. వారిని బాధపెట్టే ఏ సమస్యనైనా ప్రధానమైనదిగా భావించండి. సున్నితంగా వ్యవహరించండి. అపుడే వాళ్లు చుట్టూ ఉన్న వారిపట్ల సున్నితంగా ఉండ గలుగుతారు. ఏ వయసులో వారినైనా వారు దుఃఖంలో ఉన్నప్పుడు దగ్గరకు తీసుకోవడానికి సందేహించవచ్చు. వాళ్లు ఎప్పటికీ మీ పిల్లలే. అంటే చిన్నపిల్లలుగానే భావించాలన్న మాట.
మీ పిల్లలు కాస్త కోపంగానో, మొండిగానో ప్రవర్తించినా సతాయించినా ఓర్పు పట్టండి. ఆ సమయంలో వారికేదైనా సమస్య ఉన్నా నిస్పృహకు గురైనా అలా ప్రవర్తించవద్దు. కాబట్టి కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
అనారోగ్యంగా ఉన్న పెద్దలకు సాయం చేయడం తర్వాత తరాలవారి విధి అని తెలిసేలా చేయండి. అందుకు రోల్మోడల్గా మీరు నిలవండి. ఆర్థికంగానే కాదు శారీరకంగా మానసికంగా విజ్ఞానదాయకంగా ఎదుటివారికి సహాయపడే మనస్తత్వాన్ని కలిగించండి.
డా. డి.తులసి జ్యోతి
